న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశంలో ఇంటర్నెట్ షట్డౌన్ల మోత మోగుతున్నది. పలు కారణాలు చూపుతూ ఏటికేడు ఇంటర్నెట్ నిలిపివేత సందర్భాలు పెరిగిపోతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో ఇంటర్నెట్ షడ్డౌన్ల సంఖ్య 690కి పెరిగింది. 2021లో 101 సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 75 షట్డౌన్లు అమలు చేశారని సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. 2022లో ఈ ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు జమ్ముకశ్మీర్ ఎక్కువగా ప్రభావితమైందని, అక్కడ 43 సార్లు షట్డౌన్లు చేశారని పేర్కొన్నది. పరీక్షల్లో మోసాలను కట్టడి చేయడం నుంచి మత ఘర్షణల నియంత్రించడం, ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడం వంటి వాటిని ప్రభుత్వం ఇంటర్నెట్ షట్డౌన్లకు కారణాలుగా చూపింది. ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా ప్రజలకు అత్యవసర సేవలైన విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటివాటిపై ప్రభావం పడిందని ఎస్ఎఫ్ఎల్సీ పేర్కొన్నది.