లండన్, మే 27: సాహిత్యంలో నోబెల్ పురస్కారం తర్వాత అంతటి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తొలిసారి ఒక భారతీయ రచయితను వరించింది. ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ రచించిన ‘రేత్ సమాధి’ నవలకు ఈ ఏడాదిగాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను ప్రకటించారు. ఈ పుస్తకాన్ని ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో డైసీ రాక్వెల్ ఇంగ్లిష్లోకి అనువదించారు. అ అవార్డుతోపాటు అందించే 50 వేల పౌండ్ల నగదు బహుమతిని రాక్వెల్తో గీతాంజలి సమానంగా పంచుకోనున్నారు. ఈ అవార్డు దక్కటంపై గీతాంజలి ఉబ్బితబ్బిబ్బయ్యారు.
‘బుకర్ ప్రైజ్ వస్తదని కలలో కూడా అనుకోలేదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉన్నది. పట్టరాని ఆనందంగా ఉన్నది. హిందీతో పాటు దక్షిణాసియా భాషల్లో గొప్ప సాహిత్య సంపద ఉన్నది. నేను ఈ పుస్తకం అత్యుత్తమంగా రాయటానికి ఆ సంపదే దారిచూపింది. ఈ భాషల్లోని ఉత్తమ రచయితలను గుర్తించగలిగితే ప్రపంచ సాహిత్యం మరింత గొప్పగా తయారవుతుంది’ అని శుక్రవారం ఆమె పేర్కొన్నారు. ‘టూంబ్ ఆఫ్ శాండ్లో ఉన్న శక్తి, తీక్షణత, కథాగమన విధానానికి మేం బందీలయ్యాం. రచనలో గీతాంజలి చూపిన భిన్న విధానాలు, డైసీ రాక్వెల్ అనువాదం అద్భుతం’ అని అవార్డు జడ్జీల ప్యానల్ చైర్మన్ ఫ్రాంక్ వీన్ ప్రశంసించారు.