బెంగళూరు: కర్ణాటకలో మరో మోరల్ పోలీసింగ్ సంఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న మతాంతర జంటపై దుండగులు దాడి చేశారు. (Interfaith Couple Assaulted) ఈ విషయం గమనించిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. హవేరీ జిల్లాలోని బైద్గిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం ఒకేచోట ఉద్యోగం చేస్తున్న హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఒక జంట బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఒక ఆలయం సమీపంలో చాట్ తింటుండగా 9 మంది వ్యక్తులు అక్కడకు వచ్చారు. వారిని అడ్డుకుని ప్రశ్నించారు. తాము స్నేహితులమని, సహోద్యోగులమని చెప్పినా వినిపించుకోలేదు. వేర్వేరు మతాలకు చెందిన ఆ జంట మధ్య సంబంధం ఉన్నట్లు అనుమానించి వారిని కొట్టారు.
కాగా, అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఇది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఏడుగురు నిందితులైన అబ్దుల్ఖాదర్ ముద్గల్, మన్సూర్ తాండూర్, మెహబూబఖాన్ బడిగెర, రియాజ్ హలగేరి, అల్వాజ్, అబ్దుల్ దేసూరా, ఖాదర్ కనకేను అరెస్ట్ చేశారు. పారిపోయిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ఇటీవలే ఒక హోటల్లో ఉన్న మతాంతర జంటను కొందరు వ్యక్తులు కొట్టి హింసించడం కలకలం రేపింది.