ఈ ఏడాది 1 శాతం పెరగొచ్చు
ఆర్బీఐ పాలసీపై నోమురా అంచనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ద్రవ్యోల్బణం రిస్క్ ముంచుకొస్తున్నందున, రిజర్వ్బ్యాంక్ తన సరళతర విధానాన్ని వచ్చేవారం జరిగే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో మార్చుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 6-8 తేదీల మధ్య ఆర్బీఐ కమిటీ సమావేశంకానున్న నేపథ్యంలో నోమురా అంచనాల్ని విడుదల చేస్తూ పాలసీ రేట్లను ‘సరళతరం’ నుంచి ‘సాధారణ’ స్థాయికి తీసుకొచ్చేందుకు కేంద్ర బ్యాంక్ వచ్చేవారం తొలి అడుగు వేస్తుందని తెలిపింది. అంటే సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను పెంచే సంకేతాల్ని వెల్లడించవచ్చన్నది నోమురా అనలిస్టుల అభిప్రాయం. ఉక్రెయిన్పై రష్యా సైనికదాడి చేసినప్పటి నుంచి చమురు ధరలు పరుగులు తీయడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇది విధాన నిర్ణేతలకు సవాలుగా మారింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్తో సహా ఇతర అధికారులు సైతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం రిస్క్ల పట్ల ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. అయితే కొవిడ్ నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు ఇంకా మద్దతు అవసరం ఉందని కూడా చెపుతున్నారు. కానీ ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకుంటుందంటూ నోమురా అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ సమావేశంలో రేట్ల పెంపు సంకేతాలనిచ్చి, జూన్ పాలసీ మీటింగ్లో వడ్డీ రేట్ల పెంపును ప్రారంభిస్తుందని వారన్నారు. 2022 సంవత్సరం డిసెంబర్లోగా పలు రేట్ల పెంపులు ఉంటాయని, ఈ ఏడాదిలో మొత్తం 100 బేసిస్ పాయింట్ల (1 శాతం) వరకూ ఆర్బీఐ పాలసీ రెపో రేట్లు పెరగవచ్చని నోమురా అంచనా వేసింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాల్ని గతంలో ప్రకటించిన 7.8 శాతం నుంచి రిజర్వ్బ్యాంక్ తగ్గిస్తుందని, రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచుతుందని ఇన్వెస్ట్మెంట్ సంస్థ పేర్కొంది. ఈ పూర్తి ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతం ఉంటుందన్న అంచనాల్ని గత పాలసీ మీటింగ్ సమయంలో ఆర్బీఐ ప్రకటించింది.
పెట్రో పెంపుతో ద్రవ్యోల్బణం పైపైకి
వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు ప్రభుత్వం నియంత్రించిన రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు తిరిగి పెంచుతున్నదని, మార్చి 22 నుంచి మార్చి 31 మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.6.40-6.50 మేర పెరిగినట్టు నోమురా తెలిపింది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సగటున 112 డాలర్ల వద్ద స్థిరపడితే పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో రూ.12 వరకూ పెరగవచ్చన్నది. పెట్రో కంపెనీలు అంతర్జాతీయ ధరకు అనుగుణంగా ఎల్పీజీ సిలిండర్ ధర సవరించాల్సివస్తే మరో రూ.280 వరకూ పెంచాల్సివస్తుందన్నది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదల పూర్తయితే రిటైల్ ద్రవ్యోల్బణం 0.8 శాతం మేర అధికమవుతుందని నోమురా వివరించింది. ఫిబ్రవరి నెలలో రిజర్వ్బ్యాంక్ గరిష్ట బ్యాండ్ 6 శాతాన్ని మించి 6.07 శాతానికి చేరిన ఈ ద్రవ్యోల్బణం మార్చిలో మరింత పెరుగుతుందని, తదుపరి నెలల్లో ఇంకా పైకి ఎగబాకుతుందని ఇన్వెస్ట్మెంట్ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే వినియోగ వస్తువుల కంపెనీలు వాటి పెరిగిన ముడి పదార్థాల వ్యయాల్ని వినియోగదారులకు మళ్లిస్తున్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా గరిష్ఠస్థాయిలోనున్న వంటనూనెల ధరలు, భారత్ గోధుమ ఎగుమతులు చేయడం వంటివి ఆహారోత్పత్తుల ధరల్ని పెంచివేస్తాయని, దీంతో 2022 సంవత్సరంలో సగటున ద్రవ్యోల్బణం 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది.