న్యూఢిల్లీ, జనవరి 16: వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసుకున్న ఏ పెండ్లి అయినా హిందూ వివాహ చట్టం కింద చెల్లదని, కేవలం హిందువులు చేసుకున్న వివాహాలకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు 2017లో ఇచ్చిన ఆదేశాలపై న్యాయమూర్తులు కేఎం జోసఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఫిబ్రవరికి వాయిదా వేసింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్లో ఒక మహిళ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. హిందువునైన తాను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని 2008లో హిందూ వివాహ చట్టం ప్రకారం పెండ్లి చేసుకున్నాననని, కానీ అతడు ఇప్పుడు ఇంకో వివాహం చేసుకున్నాడని తెలిపింది. దీంతో అతడిపై హిందూ వివాహ చట్టం 494 సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై అతడు తాను క్రైస్తవుడినని, హిందూ వివాహ చట్టం తనకు వర్తించదని పేర్కొన్నాడు. పైగా ఆమెను వివాహం చేసుకున్నట్టు ఎలాంటి రుజువులు చూపనందున కేసు కొట్టి వేయాలని కోరాడు. దీనికి హైకోర్టు నిరాకరించడంతో అతను సుప్రీంను ఆశ్రయించాడు.