భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మళ్లీ చిచ్చు రేగింది. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టుకున్నారు. ఎంపీ రాజధాని భోపాల్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కంకర్ గ్రామంలోని దళిత వర్గానికి చెందిన వారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వారు ఆదివారం తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. అయితే మరో వర్గం భిన్నంగా ఆరోపించింది. గర్బా వేడుకలో భాగంగా ఇద్దరు అమ్మాయిలు అశ్లీల డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. దీనిపై వాగ్వాదం కారణంగా గొడవ మొదలైందని చెప్పారు.
మరోవైపు ఇరు వర్గాల ఆరోపణలపై ఫిర్యాదులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కర్రలతో కొట్టుకున్న వీడియో క్లిప్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గొడవకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఇరు వర్గాలు కర్రలతో దారుణంగా కొట్టుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.