INSACOG | కరోనా మళ్లీ వణికిస్తున్నది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన జేఎన్.1 కేసులు 21 నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
ఇందులో గోవాలోనే 19 కేసులు గుర్తించినట్లు పేర్కొంది. ఒకటి కేరళ, మరొకటి మహారాష్ట్రలో ఒక్కో కేసు నమోదైనట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఇన్సాకాగ్ (INSACOG)ను కేంద్రం వైరస్ జన్యువ్రేణి, వైరస్ వైవిధ్యంపై అధ్యయనం చేయడంతో పాటు పర్యవేక్షించడానికి కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2020లో ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా.. సబ్ వేరియంట్ను దేశంలో గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది.
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సన్నద్ధతపై ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న కొవిడ్ వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మరో వైపు దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించింది.