నాగపూర్,మే, 28: కోవిడ్19 వైరస్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచీ దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షా పద్ధతులను బలోపేతం చేయడం, పరీక్షల మౌలిక సదుపాయాలను పెంచుకోవడం వంటి అంశాలపై అనేక ముందడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో నాగపూర్ కు చెందిన శాస్త్రవేత్తలు మరో మైలు రాయిని అధిగమించారు. శాస్త్ర విజ్ఞాన, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.)కి అనుబంధంగా, నాగపూర్ లో ఉన్న జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ (నీరీ-ఎన్.ఇ.ఇ.ఆర్.ఐ.) శాస్త్రవేత్తలు కోవిడ్-19 నమూనాల పరీక్షకోసం కొత్త తరహా పద్ధతిని రూపొందించారు. ‘ఉప్పునీటిని పుక్కిలించడం ద్వారా ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతి లో వారీ పరీక్షకు రూపకల్పన చేశారు.
సరళం, వేగవంతం, సౌకర్యం, పొదుపు…
ఉప్పునీటిని పుక్కిలించే పద్ధతిలో జరిపే ఈ వినూత్న పరీక్షఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ప్రయోజనాలన్నీ ఒకే పరీక్షతోనే లభిస్తాయి. పరీక్షకూడా ఎంతో సరళతరంగా, వేగవంతంగా, సరసమైన ధరలో, రోగికి కూడా ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. పరీక్షను జరిపిన వెంటనే చాలా త్వరగా ఫలితం లభిస్తుంది. మౌలిక సదుపాయాల పరంగా అతితక్కువ పరికరాలు అవసరమవుతాయి.
కాబట్టి, ఈ పరీక్షా విధానం గ్రామీణ ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. ఈ సందర్భంగా నీరీ సంస్థకు చెందిన ఎన్విరాన్మెంటల్ వైరాలజీ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ “రోగి ముక్కునుంచి స్వాబ్ సేకరణకు చాలా టైం పడుతుంది. ఈ పద్ధతి రోగికి కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. తీసుకున్న నమూనాను సేకరణ కేంద్రానికి రవాణా చేయడానికి కూడా కొంత వ్యవధి వృధా అవుతుంది. దీనికి బదులు ఉప్పునీటి పుక్కలింతతో కూడిన ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతి చాలా మెరుగైనది. ఇది రోగికి సులభంగా ఉంటుంది. మరింత సౌకర్యవంతంగా, త్వరగా ఫలితం ఇచ్చేదిగా ఉంటుంది. నమూనా తయారీ కూడా అప్పటికప్పుడే వెంటనే జరుగుతుంది. ఫలితం కూడా మూడుగంటల్లోగా తేలుతుంది.” అని అన్నారు.
రోగి సొంతంగా నమూనానుసేకరించవచ్చు...
ఇది చాలా సరళతరమైన పరీక్షా విధానం. రోగి కూడా తనంతట తానే నమూనాను సేకరించవచ్చు. అని మరో శాస్త్రవేత్త డాక్టర్ ఖైర్నార్ చెప్పారు. “నాసికా రంద్రాలనుంచి, నోటినుంచి స్వాబ్ను లేదా లాలాజలాన్ని సేకరించాలంటే సాంకేతికంగా నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం. పైగా ఆ పద్ధతిలో కాలహరణం ఎక్కువగా జరుగుతుంది. దీనితో పోల్చితే, ఉప్పునీటి పుక్కిలింతతో నిర్వహించే ఆర్.టి.-పి.సి.ఆర్. పద్ధతి చాలా సరళంగా ఉంటుంది. ఉప్పునీటి ద్రావణాన్ని పరీక్షనాళికలో నింపి తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో రోగి ఉప్పునీటి ద్రావణాన్ని పుక్కిలించి, దాన్ని తన నోటిద్వారా పరీక్షనాళికలోకి ఊదేస్తే సరిపోతుంది.
ఇలా సేకరించిన ద్రావణ నమూనాను లేబరేటరీకి తీసుకెళ్లి అక్కడ గది ఉష్ణోగ్రతవద్ద నీరీ లేబరేటరీ తయారు చేసిన ప్రత్యేక ద్రావణంలో ఉంచుతారు. ఈ ద్రావణాన్ని వేడి చేసినపుడు ఒక ఆర్.ఎన్.ఎ. టెంప్లేట్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలీమిరేస్ చెయిన్ రియాక్షన్ (ఆర్.టి.-పి.సి.ఆర్.) కోసం మరింత ప్రాసెస్ చేస్తారు. ఈ పద్ధతిలో నమూనాను సేకరించి, పరీక్షకోసం ప్రాసెస్ చేయడం చాలా పొదుపుతో కూడుకున్నది. ఆర్.ఎన్.ఎ.ను సంగ్రహించేందుకు ప్రత్యేక కిట్ను ఉపయోగిస్తూ మనం ఇప్పటివరకూ అనుసరిస్తున్న పద్ధతితో పోలిస్తే తాజా పద్ధతి ఎంతో పొదుపైనది. ఎవరికివారు తమంతట తామే పరీక్షించుకునేందుకు ఈ పద్ధతిలో అవకాశం ఉంది.” అని ఖైర్నార్ అన్నారు. “ఈ పద్ధతిలో వృధా అయ్యే పదార్థాలు కూడా చాలా తక్కువ కాబట్టి, ఇది పర్యావరణ హితంగా కూడా ఉంటుందని” ఖైర్నార్ అన్నారు.