న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. గంట గంటకు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. తీహార్ జైల్లో 16 మంది ఖైదీలకు, 21 మంది సిబ్బందికి, మండోలి జైల్లో ఐదుగురు ఖైదీలకు, ఇద్దరు సిబ్బందికి, రోహిణి జైల్లో ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా బారిన పడ్డ ఖైదీలను, సిబ్బందిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో ఒమిక్రాన్ వ్యాప్తితో జనవరి నెలాఖరులో కొవిడ్-19 తదుపరి వేవ్ ముమ్మర దశకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నెలాఖరు నాటికి భారత్లో రోజూ 4 నుంచి 8 లక్షల కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్ మార్చి నాటికి సమసిపోతుందని అంచనా వేశారు.
జనవరి మధ్యలో ఢిల్లీ, ముంబైలో ఒమిక్రాన్ వేవ్ ముమ్మర దశకు చేరుకుంటుందని ఈ రెండు సిటీల్లో అప్పటికి రోజుకు 30,000 నుంచి 50,000 కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. కఠిన లాక్డౌన్ల ద్వారా ఈ వేవ్లను నియంత్రించవచ్చని అది మహమ్మారి కొనసాగేందుకు దోహదపడుతుందని అన్నారు. లాక్డౌన్ విధించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధపై భారాన్ని నివారించవచ్చని చెప్పారు.