HIV | లక్నో, మార్చి 5: అభం శుభం ఎరుగని ఏడాది వయసున్న చిన్నారికి డాక్టర్లు నిర్లక్ష్యంగా ఇన్ఫెక్షన్ సోకిన సిరంజితో ఇంజెక్షన్ ఇవ్వడంతో హెచ్ఐవీ బారిన పడింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనిపై వెంటనే విచారణ జరపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రభుత్వానికి చెందిన ఈటా అటానమస్ మెడికల్ కాలేజీలో ఏడాది వయసు పాపను చికిత్స కోసం చేర్చారు. అక్కడ హెచ్ఐవీ సోకిన మరో చిన్నారి కూడా చికిత్స పొందుతున్నది. అయితే డాక్టర్లు ఆ పాపకు ఇంజెక్షన్ చేసిన సిరంజితోనే అక్కడ చికిత్స పొందుతున్న మిగిలిన రోగులకు కూడా సూదిమందు ఇచ్చారు. దీనికి వారు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.
అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడ చికిత్స పొందిన పాపకు పరీక్షలు చేయగా ఆమెకు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోలో డాక్టర్ల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై స్పందించిన దవాఖాన సీఎంఎస్ అశోక్ కుమార్ దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడు దవాఖానలో చికిత్స పొందిన పిల్లలందరికీ ముందుజాగ్రత్త చర్యగా హెచ్ఐవీ నివారణ డోస్ను వేసినట్టు తెలిపారు. వారిని మరో నెల తర్వాత వ్యాధి లక్షణాలున్నవీ లేనిదీ పరీక్షిస్తామని తెలిపారు. కాగా జరిగిన సంఘటనపై డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్పందించారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.