ముంబై: ఇండియాలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్పై ఆరెస్సెస్( RSS on Infosys )కు చెందిన పాంచజన్య మ్యాగజైన్ తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలుసు కదా. ఆ సంస్థ కావాలని నక్సల్స్, వామపక్షవాదులు, తుక్డే తుక్డే గ్యాంగ్కు సహకరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే మరుసటి రోజే ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్ చెప్పడం గమనార్హం. సంఘ్ ఆలిండియా పబ్లిసిటీ ఇన్చార్జ్ సునీల్ అంబేద్కర్ ట్విటర్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు.
భారత్ అభివృద్ధిలో ఇన్ఫోసిస్ పాత్ర కీలకం అని ఆయన అనడం విశేషం. ఆ సంస్థ అభివృద్ధి పోర్టల్లలో సమస్యలు ఉన్న మాట నిజమే కావచ్చు. అయితే పాంచజన్య మాత్రం ఆరెస్సెస్ అధికారిక మ్యాగజైన్ కాదు. అందువల్ల దాని అభిప్రాయం వ్యక్తిగతంగా భావించాలి అని సునీల్ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇన్ఫోసిస్ సంస్థపై పాంచజన్య ఆరోపణలు సంచలనం రేపాయి. ఓ ప్రభుత్వ ప్రాజెక్ట్ను ఇలా పాడు చేయడం ఇన్ఫోసిస్కు ఇదేమీ కొత్త కాదని ఈ వీక్లీ మ్యాగజైన్ ఆరోపించింది. ఆ సంస్థ తయారు చేసిన ఐటీ పోర్టల్లో ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఈ నెల 15 వరకూ ఆ సంస్థకు గడువు విధించింది.