Narayana Murthy | న్యూఢిల్లీ, మార్చి 18: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోమారు హెడ్లైన్స్లో నిలిచారు. ఆయన తన నాలుగు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా రాసిచ్చారు. తాత పెట్టిన ఒక్క సంతకంతో రోహన్ ఇండియాలో అతి పిన్నవయస్కుడైన మిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు. రోహన్ పేరిట ఇప్పుడు 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నట్టు ఎక్స్చేంజ్ ఫైలింగ్ను బట్టి తెలిసింది.
కంపెనీ షేర్ల శాతంలో ఇది 0.04 శాతం. మనవడికి షేర్లు గిఫ్ట్గా ఇవ్వడానికి ముందు ఇన్ఫోసిస్లో నారాయణమూర్తి షేర్ల వాటా 0.40 శాతం కాగా, ఇప్పుడు అది 0.36 శాతానికి పడిపోయింది. ఇప్పుడాయన ఖాతాలో 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి. ఏకాగ్రహ్ నవంబర్ 2023లో రోహన్మూర్తి, అపర్ణామూర్తికి జన్మించాడు. నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులకు ఆయన మూడో మనవడు. అక్షతామూర్తి-యూకే ప్రధాని రిషి సునాక్ దంపతుల ఇద్దరు కుమార్తెలకు కూడా వీరే గ్రాండ్ పేరెంట్స్.