ముంబై: ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పారేఖ్ ఏడాది జీతం రూ.71 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఆయనకు వార్షిక పరిహారంగా 71 కోట్లు ఇస్తున్నట్లు ఆ కంపెనీ తన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో పేర్కొన్నది. 2021-22 సంవత్సరానికి ఆయన జీతం 43 శాతం పెరిగింది. సగంపైగా జీతం ఆయనకు తన వద్ద ఉన్న స్టాక్ ఆప్షన్ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. 2020-21 సంవత్సరానికి 49.68 కోట్లు, 2019-20 సంవత్సరానికి 34.27 కోట్ల రెమ్యూనరేషన్ను ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ తీసుకున్నట్లు వార్షిక రిపోర్ట్ ద్వారా స్పష్టమవుతోంది.
సలిల్ పారేఖ్ను ఇటీవల సీఈవో, ఎండీగా అయిదేళ్ల పదవీకాలం కోసం పునర్ నియమించారు. జూలై 2022 నుంచి మార్చి 2037 వరకు ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కంపెనీ ప్రదర్శన బలపడడం, షేర్హోల్డర్ విలువ కూడా పెరగడం వల్ల మళ్లీ ఆయన్నే సీఈవోగా నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకున్నది. ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ 2020-21 సంవత్సరానికి రూ.25.76 కోట్ల జీతం తీసుకున్నట్లు తెలుస్తోంది.