శ్రీనగర్ : కుప్వారా జిల్లాలో పాక్లో చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాక్ జాతీయుడిని హతమార్చినట్లు సైన్యం ఆదివారం తెలిపింది. సదరు వ్యక్తిని నుంచి ఏకే-47, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే ఉందని సైనిక అధికారులు చెప్పారు. ఈ చర్యను పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) చొరబాటుగా భారత అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల కేరన్ సెక్టార్లో అక్రమంగా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. వెంటనే స్పందించిన భారత సైన్యం ఆ ఉగ్రవాదిని హతమార్చినట్లు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అతడి కదలికలను గమనించినట్లు స్పష్టం చేశారు. చనిపోయిన ముష్కరుడిని పాక్కు చెందిన మహ్మద్ షబ్బీర్ మాలిక్గా గుర్తించారు. అతడి వద్ద పాక్ జారీ చేసినట్లుగా ఉన్న గుర్తింపు కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను ఆర్మీ స్వాధీనం చేసుకున్నది. వీటిని బట్టి చూస్తే సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు స్పష్టం అవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
సంఘటనా స్థలంలో నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఉగ్రవాది చొరబడేందుకు ప్రయత్నించిన మార్గంలో 2020 ఏప్రిల్ 4న నిర్వహించిన ఆపరేషన్లో సైన్యం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చింది. ఇదిలా ఉండగా.. హతమైన ఉగ్రవాది మృతదేహాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పాక్ సైన్యానికి హాట్లైన్ కమ్యూనికేషన్ భారత సైన్యం సమాచారం అందించింది.