ఇండోర్: నిరుద్యోగి అయిన భర్తకు నెలకు రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని భార్యను ఇండోర్లోని కుటుంబ న్యాయస్థానం ఈ నెల 20న ఆదేశించింది. వ్యాజ్య ఖర్చులను కూడా భరించాలని ఆమెకు స్పష్టంచేసింది. ఆమె ఓ బ్యూటీ పార్లర్కు యజమానురాలు కావడంతో ఈ తీర్పు చెప్పింది. ఆమె మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేయడంతో 12వ తరగతి తర్వాత తన క్లయింట్ పై చదువులు చదువుకోలేకపోయాడని భర్త తరఫు న్యాయవాది తెలిపారు. తన క్లయింట్ను ఆమె ఏకపక్షంగా ప్రేమించారని, ఆమె బంధువులు ఆయనను బెదిరించి, ఇద్దరికీ 2022లో ఆర్య సమాజ్లో పెళ్లి చేశారని చెప్పారు.
కొంత కాలం తర్వాత ఆ యువజంట విడిపోయారన్నారు. తాను నిరుద్యోగినని, తనను తాను పోషించుకోలేకపోతున్నానని, తనకు భరణం ఇప్పించాలని కుటుంబ న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారని తెలిపారు. అదేవిధంగా, ఇండోర్ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించి, తన భార్య, ఆమె బంధువులు తనను తీవ్రంగా హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ఆమె కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, వివాహ బంధాన్ని పునరుద్ధరించాలని కోరారని తెలిపారు. అంతేకాకుండా తనను తన భర్త గృహ హింసకు గురి చేస్తున్నట్లు జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారని చెప్పారు. ఆమె సంపాదనను పరిగణనలోకి తీసుకుని ఆమె భర్తకు నెలకు రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఆమెను ఆదేశించిందని తెలిపారు.