న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే వంట నూనె ధరలు సబ్బుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులకు ఇది ఊరట కలిగించే వార్తే. రాబోయే రోజుల్లో నూనెల ధరలు దిగిరానున్నాయి. పామాయిల్ ఎగుమతిపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేయనున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని పలువురు వ్యాపారులు ఎగుమతి ఆంక్షలు ఎత్తివేయాలని అధ్యక్షుడిని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. సమాచారం ప్రకారం.. ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో నిల్వలు భారీగా పెరిగిపోయాయి.
ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఆయిల్ రంగంలో భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాపారులు పేర్కొన్నారు. గత నెల 28న పామాయిల్ ఎగుమతులపై అక్కడి సర్కారు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇండోనేషియా ఓడరేవులతో సహాదాదాపు ఆరు మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. అదే సమయంలో నిషేధం తర్వాత దేశీయ స్టాక్ మే ప్రారంభంలోనే దాదాపు 5.8 మిలియన్ టన్నులకు చేరింది. ఇండోనేషియా పామ్ ఆయిల్ అసోసియేషన్ (GAPKI) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి చివరి నాటికి, దేశీయ స్టాక్ ఫిబ్రవరిలో 5.05 మిలియన్ టన్నుల నుంచి 5.68 మిలియన్ టన్నులకు పెరిగాయి.
ఎగుమతులపై నిషేధం తర్వాత, నిల్వలు భారీగా పెరుకుపోయాయి. విశేషమేమిటంటే, ఇండోనేషియా వార్షిక పామాయిల్ ఉత్పత్తిలో దేశీయంగా 35శాతం మాత్రమే ఉపయోగిస్తుంది. ఎక్కువగా ఆహారం, ఇంధనం కోసం మాత్రమో ఉపయోగిస్తుంటుంది. ఇదే సమయంలో భారతదేశం పామాయిల్ కోసం ఇండోనేషియాపై ఎక్కువ ఆధారపడుతున్నది. ప్రస్తుతం ఎగుమతులపై ఆంక్షలను తొలగించడంతో దేశీయంగా ధరల పెరుగదల నుంచి కాస్త ఊరట లభించనున్నది. భారత్ ఏటా పామాయిల్ను 70శాతం ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకుంటుంది. కాగా, 30 శాతం మలేషియా నుంచి దిగుమతి అవుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 83.1 లక్షల టన్నుల పామాయిల్ను దిగుమతి చేసుకుంది.