న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన తండ్రి డాక్టర్ కే సుబ్రహ్మణ్యం పిన్న వయస్కుడైన కార్యదర్శిగా ఉండేవారని, ఇందిరా గాంధీ 1980 అధికారంలోకి రాగానే డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ పదవి నుంచి ఆయనను తొలగించారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గుర్తు చేసుకున్నారు. రక్షణ రంగంలో ఆయనను గొప్ప పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా అందరూ చెప్పేవారని పేర్కొన్నారు. మళ్లీ తర్వాత ఆయన ఎప్పుడూ కార్యదర్శి కాలేకపోయారని, రాజీవ్గాంధీ హయాంలోనూ తన తండ్రికి గుర్తింపు దక్కలేదని, ఆయన కంటే జూనియర్ అధికారిని క్యాబినెట్ సెక్రటరీని చేశారని పేర్కొన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు.