ఇండోర్: రాయ్పూర్ నుంచి ఇండోర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ 6ఈ-905 విమానం క్యాబిన్లో బుధవారం పొగలు వచ్చినట్లు వచ్చిన వార్తలను ఆ విమానయాన సంస్థ ఖండించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్లైన్స్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (హెచ్వీఏసీ) తేమ కారణంగా పొగమంచు ఏర్పడిందని ఇండిగో ఎయిర్లైన్స్ వివరణ ఇచ్చింది. కొన్ని సంస్థలు స్వార్థ ప్రయోజనాల కోసం తమ వినియోగదారులు, అధికారులను తప్పుదోవ పట్టించేందుకు అసత్య ప్రచారం చేశాయని ఎయిర్లైన్స్ పేర్కొంది.
రాయ్పూర్నుంచి మంగళవారం బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ఇండోర్ చేరుకోగానే అందులో పొగలు కమ్ముకున్నాయని డీజీసీఏ అధికారులు బుధవారం తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేసినట్లు పేర్కొన్నారు. దీనిపై డీజీసీఏ విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా, బ్యాంకాక్ నుంచి మంగళవారం బయలుదేరిన విస్తారా విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఇంజిన్ ఫెయిల్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దింపినట్లు డీజీసీఏ పేర్కొంది. ఈ ఘటనపై స్పందిస్తూ, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇంజిన్లోని ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ జనరేటర్ (ఐడీజీ)లో ‘చిన్న’ విద్యుత్ లోపం ఏర్పడిందని ఎయిర్లైన్ పేర్కొంది.
స్పైస్ జెట్ విమానాల్లో వరుస సాంకేతిక లోపాల తర్వాత డీజీసీఏ బుధవారం ఆ ఎయిర్లైన్కు షో కాజ్ నోటీసు జారీ చేసింది. స్పైస్జెట్ ఎయిర్క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 134, షెడ్యూల్ XI నిబంధనల ప్రకారం ‘సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన విమాన సేవలను ఏర్పాటు చేయడంలో విఫలమైంద’ని జారీ చేసిన నోటీసులో పేర్కొంది.