న్యూఢిల్లీ, జూలై 5: వాతావరణం, తుఫాన్ హెచ్చరికల కోసం ప్రాథమికంగా తీసుకొచ్చిన సూపర్ కంప్యూటర్ల పరిధి ప్రస్తుతం ఎంతగానో విస్తరించింది. కెమిస్ట్రీ ఫార్ములేషన్, ప్రొటీన్ ఫోల్డింగ్, బయోమెడిసన్, శాటిలైట్ ప్లేస్మెంట్స్ తదితర వినూత్న రంగాల్లో వీటి పాత్ర అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని, సంఖ్యను పెంచుకోవడంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్ అంతకంతకూ వెనుకబడిపోతున్నది. టాప్-500 సూపర్ కంప్యూటర్లలో మూడింట రెండొంతుల కంప్యూటర్లు చైనా, అమెరికా దగ్గర ఉంటే, మన దగ్గర మాత్రమే ఉండటం గమనార్హం.
భారత్లో తొలి సూపర్ కంప్యూటర్ పరమ్ 8000. 1991లో దీన్ని తీసుకొచ్చారు. ఈ సూపర్ కంప్యూటర్కు కొన్ని అదనపు హంగులు, సామర్థ్యాన్ని జోడించి ఇప్పటివరకు పదికి పైగా వెర్షన్లను అందుబాటులోకి తెచ్చారు. పరమ్ సిరీస్లో అత్యధిక సామర్థ్యం, వేగంతో కూడిన సూపర్ కంప్యూటర్గా పేరొందిన ‘పరమ్ సిద్ధి’ని 2020 నవంబర్లో ఆవిష్కరించారు. అప్పుడు దాని సామర్థ్యం 5.27 పెటాఫ్లాప్స్. టాప్ 500 గ్లోబల్ ర్యాంకింగ్ సర్వీసుల్లో అప్పుడు ఇది 63వ స్థానంలో ఉండేది. కాగా, ఇప్పుడు 111వ స్థానానికి దిగజారింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ (ఐఐటీఎం) తీసుకొచ్చిన ‘ప్రత్యూశ్’ సూపర్ కంప్యూటర్ తొలుత 100లోపు ర్యాంకును కైవసం చేసుకోగా, ఇప్పుడు 132వ స్థానానికి పడిపోయింది. మొత్తంగా టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో భారత్కు చెందిన కంప్యూటర్లు 3 మాత్రమే స్థానాన్ని దక్కించుకున్నాయి. టాప్-100లో ఏ ఒక్క కంప్యూటర్ కూడా లేదు. ఇదే సమయంలో చైనాకు చెందిన 173, అమెరికాకు చెందిన 128 సూపర్ కంప్యూటర్లు టాప్ 500 జాబితాలో ఉన్నాయి.
సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని, సంఖ్యను పెంచడంలో బడ్జెట్ అవరోధంగా మారుతున్నది. ప్రత్యూశ్ సామర్థ్యాన్ని కనీసం 150 పెటాఫ్లాప్స్కు పెంచాల్సిన అవసరముంది. బడ్జెట్ పరిమితుల కారణంగా 10-20 పెటాఫ్లాప్స్ వరకే సామర్థ్యాన్ని పెంచగలిగే పరిస్థితులు ఉన్నాయి.
-సూర్యచంద్ర రావ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఐటీఎం
తక్కువ సమయంలో ఎక్కువ పనులను చేయడమే సూపర్ కంప్యూటర్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచ దేశాలు ఎక్సాఫ్లాప్స్ వెనుక పరిగెడుతుంటే, మనం ఇంకా పెటాఫ్లాప్స్లోనే ఉన్నాం. మన పనితీరు ఇలాగే కొనసాగితే వెనుకబడే ఉంటాం. బయటి దేశాల్లో వాణిజ్య కంపెనీలే పెద్ద మొత్తంలో సూపర్ కంప్యూటర్లను వినియోగిస్తున్నాయి. మనదగ్గర పరిశోధన సంస్థల్లోనే సూపర్ కంప్యూటర్ల వాడకం ఉన్నది. సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం మెరుగవ్వాలంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, పెద్ద పరిశ్రమలను అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది.
-ప్రీతి సయాల్, టెక్ నిపుణురాలు