Smart Cities | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆచరణలో ఆమడ దూరంలో ఉంది. మూడు సార్లు గడువు పెంచినా, స్మార్ట్ సిటీల్లో 66 నగరాల్లో అందుకు సంబంధించిన ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి.
ప్రాజెక్టు పనులు 2020 వరకు పూర్తి చేయాలని తొలుత లక్షాన్ని నిర్ధారించినా, ఆ తరువాత గడువు 2023కు పెంచారు. కోవిడ్-19 సంక్షోభం పేరుతో మరో సారి గడువును 2024 వరకు పెంచారు. అయినప్పటికీ స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన నగరాల్లో చేపట్టిన 7821 ప్రాజెక్టుల్లో 5343 మాత్రమే పూర్తయినాయి. దేశంలోని 100 నగరాలను అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతామని 2015లో ‘స్మార్ట్ సిటీ’ పథకాన్ని మోదీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించింది. ఈ- గవర్నెన్స్, ఐటీ కనెక్టివిటీ, రోడ్లు, రవాణా అనుసంధానం, పరిశుభ్రత, వాతావరణ కాలుష్య నివారణ..మొదలైనవి ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, 68 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయినట్లు పేర్కొన్నా అది ప్రజలను తప్పుదోవ పట్టించేట్టు ఉంది. ఆర్టీఐ ద్వారా వెలుగు చూసిన సమాచారం మేరకు 22 నగరాల్లో 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. 25 నుంచి 50శాతం మధ్య పనులు పూర్తిచేసుకున్న నగరాలు మరో 19 ఉన్నాయి. ఇక మిగిలిన 25 నగరాల్లో 50 శాతం దాటింది. అస్సాం, మిజోరం రాష్ర్టాలలో 68శాతం, 70శాతం నిధులు ఖర్చయ్యాయి. నిధులు విడుదల చేయకపోవడం, బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ ప్రాజెక్టు నత్తనడక సాగటానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. బ్యూరోక్రసీ, రాజకీయ ప్రాధాన్యతలు, అధికారుల బదిలీలు కూడా సమస్యలుగా మారాయని పేర్కొన్నారు.