న్యూఢిల్లీ: ఆయిల్ పైప్లైన్ సర్వే చేయడానికి ఓ డ్రోన్.. ఏకంగా 51 కిలోమీటర్ల మేర ఏకధాటిగా ఎగిరింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం హర్యానా-ఢిల్లీ మధ్య ఈ డ్రోన్ను ఎగురవేసినట్టు తయారీ సంస్థ ఓమ్నీప్రెజెంట్ రోబో టెక్నాలజీస్ సీఈవో ఆకాశ్ సిన్హా తెలిపారు. దేశంలో ఎక్కడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించిన డ్రోన్ ఇదేనన్నారు. ‘ఓమ్నీ-హంసా వీ5 హైబ్రిడ్ ఫిక్స్డ్ వింగ్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్’గా పిలుస్తున్న ఈ డ్రోన్ ప్రయాణానికి ఎలాంటి రన్వే అవసరం లేదని, హెలికాప్టర్ మాదిరిగా ఉన్న చోటనే పైకి ఎగురడం, కిందకు దిగడం ఈ డ్రోన్ ప్రత్యేకత అని తెలిపారు. డ్రోన్లోని ట్రాకర్ ద్వారా 4జీ నెట్వర్క్తో పర్యవేక్షించవచ్చని చెప్పారు. దీని పరిధిని 100 నుంచి 200 కిలోమీటర్లకు పెంచాలని హెచ్పీసీఎల్ కోరుతున్నదని తెలిపారు.