అనగనగా ఓ రాజు. ఆయనకు ఓ స్నేహితుడు. మిత్రుడంటే రాజావారికి ఎనలేని ప్రీతి. ఏం అడిగినా కాదనకుండా ఇచ్చేస్తాడు. 30 ఏండ్ల క్రితం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఆ మిత్రుడు.. రాజావారి అండదండలతోనే వేల కోట్లకు పడగలెత్తాడు. అయినప్పటికీ, వ్యాపార విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ మిత్రుడి కన్ను ఆదివాసీల భూములపై పడింది. కోట్లు కురిపించే నిధి ఆ భూముల్లో ఉండటమే దానికి కారణం.ఇంకేముంది..? ఆప్తమిత్రుడైన రాజు సాయంతో అడవి బిడ్డల నోట్లో మట్టిగొట్టి దొడ్డిదారిన నిధిని చేజిక్కించుకొన్నాడు. పచ్చని వనదేవతను బుగ్గిపాలు చేశాడు. చందమామ కథలా కనిపిస్తున్నప్పటికీ, ఇది కథ కాదు. కఠోర వాస్తవం. ఇందులో రాజావారు ప్రధాని. నేస్తం అదానీ ఎంటర్ప్రైజెస్. ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అరండో బొగ్గు గనులే నిధి.
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ సంస్థల జేబులు నింపేవిగానే కాకుండా పర్యావరణాన్ని బుగ్గిపాలు చేసేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ అరండోలో నిక్షిప్తమై ఉన్న అపార బొగ్గు నిల్వల కోసం అదానీ ఎంటర్ప్రైజెస్ సాగిస్తున్న విధ్వంసం, మైనింగ్ కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో ఆ గ్రూప్ అవకతవకలకు పాల్పడిన విధానం, దీనికి బీజేపీ ప్రభుత్వం చేసిన సాయం.. ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీటిని ధ్రువపరుస్తూ బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘గార్డియన్’ కూడా ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఉత్తర ఛత్తీస్గఢ్లోని మూడు జిల్లాలు సర్గూజా, సుజాపూర్, కోర్బాలో 1,800 చదరపు కిలోమీటర్ల మేర హస్దేవ్ అరండో అభయారణ్యం విస్తరించి ఉన్నది. వందలాది ఆదివాసీ జాతులు ఇక్కడ శతాబ్దాల తరబడి నివసిస్తున్నాయి.
ఈ అటవీ భూముల్లో వేల టన్నుల బాక్సైట్, మాంగనీసు, సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ భూముల్లో 500 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అంచనా. ఈ నిల్వలు భూ ఉపరితలానికి కొంత లోతులోనే ఉన్నాయి. దీంతో అప్పటికే బొగ్గు రంగంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ ఇక్కడి బొగ్గు గనులనూ చౌకగా చేజిక్కించుకోవాలనుకొన్నది. 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇక్కడి బొగ్గు నిక్షేపాలను 23 బ్లాకులుగా విభజించి పర్సా ఈస్ట్ కంటె బాసన్ (పీఈకేబీ) పేరిట ఆరు బ్లాకులకు టెండర్లను పిలిచింది. అప్పుడు దేశంలో విద్యుత్తు సంక్షోభం నెలకొన్న కారణంగా టెండర్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్తు కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ డీల్ను రాజస్థాన్కు చెందిన రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీయూఎన్ఎల్) చేజిక్కించుకొన్నది. అయితే, ఆ సమయంలో రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గుజరాత్లో మోదీ సీఎంగా ఉన్నారు. పీఈకేబీ బ్లాక్ బొగ్గు గనుల కోసం అదానీ గ్రూప్ అప్పటి గుజరాత్ సీఎంతో రాయబారం నడిపినట్టు వార్తలు గుప్పుమన్నాయి.
వీటికి బలాన్ని చేకూరుస్తూ.. ఆర్ఆర్వీయూఎన్ఎల్.. అదానీ ఎంటర్ప్రైజెస్కి రాత్రికి రాత్రి బొగ్గు తవ్వకాలకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ కట్టబెట్టింది. మరుసటి ఏడాది పర్సా కంటె క్యాలరీస్ లిమిటెడ్ (పీకేసీఎల్) పేరిట ఆర్వీయూఎన్ఎల్తో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఆ వెంచర్లో 74 శాతం వాటాను చేజిక్కించుకొన్నది. 2014లో కాంట్రాక్టును మొత్తం హస్తగతం చేసుకోవడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రయత్నించింది. బొగ్గు గనులు ఉన్న ఛత్తీస్గఢ్లో రమణ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉండటం.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కలిసొచ్చింది. అలా.. పీఈకేబీలోని నాలుగు బ్లాకులు (మార్కెట్ విలువ రూ. 1.6 లక్షల కోట్లు) అదానీ ఎంటర్ప్రైజెస్కు దక్కాయి.
అన్నం పెట్టిన వారికే సున్నం
రాజస్థాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్తు కంపెనీ నుంచి సిఫారసులతో కాంట్రాక్ట్ను దక్కించుకొన్న అదానీ ఎంటర్ప్రైజెస్.. హస్దేవ్ నుంచి చౌక ధరకే బొగ్గును సమీపంలోని తమ గ్రూప్నకు చెందిన విద్యుత్తు కంపెనీలకు తరలిస్తున్నది. ఇందుకోసం టన్నుకు రూ. 450 చార్జ్ చేస్తున్నట్టు బిల్లుల్లో చూపిస్తున్నది. అయితే, తమకు కాంట్రాక్ట్ రావడానికి కారణమైన రాజస్థాన్లోని ఆర్వీయూఎన్ఎల్ వంటి విద్యుత్తు కంపెనీలకు అదానీ ఎంటర్ప్రైజెస్ టన్నుకు రూ. 2,175 చార్జ్ చేస్తున్నట్టు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వేసిన ఓ పిటిషన్లో వెల్లడైంది. మరోవైపు, అదానీ ఎంటర్ప్రైజెస్కు అప్పగించిన బొగ్గు గనుల లీజును రద్దు చేయాలని కోరుతూ ఇక్కడి వందలాది ఆదివాసీలు, గ్రామస్థులు 2013 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న మైనింగ్ కారణంగా సమీపంలోని నదీజలాలు విషపూరితమయ్యాయని, తాము ఆవాసం కోల్పోయామని, లక్షలాది వృక్ష జాతులు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘హస్దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి (హెచ్ఏబీఎస్ఎస్)’ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ, వందల కిలోమీటర్లలో పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. మైనింగ్ కార్యకలాపాలను రద్దు చేయాలంటూ ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి గత అక్టోబర్లో లేఖ రాసింది. అయినప్పటికీ, కేంద్రప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
‘హస్దేవ్ అరండో’లో అదానీ ఎంటర్ప్రైజెస్కు ఎంత దక్కిందంటే?
మొత్తం బొగ్గు నిల్వలు 500 కోట్ల టన్నులు
ఒక్కో బ్లాక్లో బొగ్గు నిల్వలు 45 కోట్ల టన్నులు
ఒక్కో బ్లాక్లోని బొగ్గు విలువ రూ. 41 వేల కోట్లు
అదానీ ఎంటర్ప్రైజెస్ చేజిక్కించుకున్న మొత్తం బ్లాకులు: 4
ప్రాజెక్టుతో అదానీ ఎంటర్ప్రైజెస్కు చేకూరిన లబ్ధి రూ.1.6 లక్షల కోట్లు
మొత్తం బొగ్గు గనులు కేటాయిస్తే లబ్ధి రూ. 4.5 లక్షల కోట్లు
గడిచిన 8 ఏండ్లలో ఎంత తేడా??
అదానీ ఎంటర్ప్రైజెస్ కారణంగా హస్దేవ్ అరండోలో పచ్చదనం కోల్పోయిన ప్రాంతం 1400 చదరపు కిలోమీటర్లు సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’తో ఏర్పడ్డ పచ్చదనం 1400 చదరపు కిలోమీటర్లు
మసి దిబ్బగా మారింది
15 ఏండ్ల కిందట మా గూడెంలో 200 వరకూ పూరిండ్లు ఉండేవి. ఇప్పుడు అందరూ పట్టణాలకు పోయారు. పచ్చగా చెట్లతో కళకళలాడే ఈ ప్రాంతం మసి దిబ్బగా మారిపోయింది.
–భోలేనాథ్ సింగ్, కెటె గ్రామస్థుడు