న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 21వ తేదీన దేశంలో కోవిడ్ టీకా పంపిణీ విషయంలో వంద కోట్ల మార్క్ను అందుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఘనత దేశంలోని ప్రతి ఒక పౌరుడికి చెందుతుందన్నారు. ఈ మార్క్ను అందుకున్న నేపథ్యంలో ప్రతి పౌరుడికి కంగ్రాట్స్ చెబుతున్నట్లు ప్రధాని అన్నారు. వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు కేవలం సంఖ్య మాత్రమే కాదు అని, దేశ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అన్నారు. కఠిన పరిస్థితుల్లో ఇండియా ఓ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు చెప్పారు. లక్ష్యాల కోసం దేశం కఠినంగా పనిచేస్తుందన్న సంకేతాన్ని చెబుతుందన్నారు. ఇది భారత సామర్ధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. కొత్త ఇండియా ఇమేజ్కు ఇది నిదర్శనమన్నారు. బిలియన్ వ్యాక్సిన్ డోసుల పంపిణీలో వీఐపీ కల్చర్ చోటుచేసుకోలేదన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మొదట్లో చాలా భయాందోళనలు వ్యక్తం అయ్యాయని, ఇండియా లాంటి దేశంలో వ్యాక్సిన్ క్రమశిక్షణ ఎలా సాధ్యం అవుతుందని విమర్శించారన్నారు. సబ్కా సాత్.. సబ్ కా వికాశ్కు ఇండియా వ్యాక్సిన్ ప్రోగ్రామ్ సజీవ ఉదాహరణ అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వీఐపీ కల్చర్ ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఒక్కర్నీ సమంగా చూశామన్నారు. దేశంలో జరిగిన వ్యాక్సినేషన్ విధానంపై గర్వంగా ఫీలవ్వాలని, శాస్త్రీయ పద్ధతిలో.. శాస్త్రీయ ఆధారంగా వ్యాక్సినేషన్ జరిగినట్లు ప్రధాని తెలిపారు. సంపూర్ణంగా సైంటిఫిక్ పద్ధతుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగినట్లు ఆయన చెప్పారు.
భారత ఆర్థికవ్యవస్థ పట్ల దేశంలోని, విదేశాల్లోని నిపుణులు పాజిటివ్గా ఉన్నట్లు ప్రధాని తెలిపారు. రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, అలాగే యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు అంతటా ఆశావాదమే కనిపిస్తోందన్నారు. ఇప్పుడు అందరూ మేడిన్ ఇండియా గురించి మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, వాళ్లంతా వ్యాక్సినేట్ కావాలని, వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లు ఇతరుల్ని ఎంకరేజ్ చేయాలని, రాబోయే పండుగ సీజన్ వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మోదీ తెలిపారు.