Indian Degree Equal in UK | మనదేశంలో బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు చదివిన ఇండియన్ విద్యార్థులు ఇక నుంచి బ్రిటన్లో ఉద్యోగాలు పొందడం తేలిక. ఈ మేరకు బ్రిటన్, భారత్ అధికారుల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదరనుంది. దీని ప్రకారం ఇండియన్ సెకండరీ స్కూల్ లేదా ప్రీ-యూనివర్సిటీ సర్టిఫికెట్ సంపాదించుకున్న భారతీయ విద్యార్థులు.. బ్రిటన్లోని ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడానికి అర్హులే. అలాగే, భారత్లోనూ, బ్రిటన్లోనూ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ రెండు దేశాల్లో సమానంగా పరిగణిస్తారు.
మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సులను ఈ ఎంవోయూ నుంచి మినహాయించారని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం మీడియాకు చెప్పారు. రెండు దేశాల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం కింద గుర్తింపు కోసం చర్చలు జరుపుతుందన్నారు. వచ్చేనెల 31 నాటికి చర్చలు ముగిసి, దీపావళికల్లా ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు.
`దీని ప్రకారం బ్రిటన్లోని డిగ్రీ కోర్సులు ఇప్పటి నుంచి భారత డిగ్రీ కోర్సులతో సమానంగా పరిగణిస్తారు. మీరు ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేస్తే, బ్రిటన్లో ఉద్యోగానికి అర్హులు. ఇది పూర్తిగా గ్రాడ్యుయేట్లకు మాత్రమే వర్తిస్తుంది` అని బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. భారత్లో చదివే బీఏ-ఎంఏ, బీఎస్సీ-ఎంఎస్సీ కోర్సులు.. బ్రిటన్లో సమానంగా పరిగణిస్తారు. ఆన్లైన్ కోర్సుల్లో పొందే డిగ్రీలకు ఈ ఎంవోయూ వర్తిస్తుంది.