న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రధాని మోదీకి ‘ప్రత్యేక స్నేహితుడి’గా సుపరిచితమైన గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద శ్రీమంతుడిగా ఆవిర్భవించారు. కొవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు, హంగర్ ఇండెక్స్లో భారత్ అట్టడుగు స్థాయికి దిగజారినా అదానీ సంపద మాత్రం భారీగా పెరిగింది. దీంతో రూ.10 లక్షల కోట్ల సంపదతో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ల తర్వాతి స్థానాన్ని ఆక్రమించారు. ఫ్రాన్స్ లగ్జరీ ఫ్యాషన్ దిగ్గజం బెర్నార్డ్ అర్నాల్ట్ను నాల్గోస్థానానికి నెట్టేశారు. శ్రీమంతుల జాబితాలో ఇప్పటివరకు మూడోస్థానానికి చేరిన ఆసియా వ్యాపార వేత్త అదానీయే.
2014 తర్వాతే మహర్దశ
మూడు దశాబ్దాల కింద వజ్రాల ట్రేడింగ్తో వ్యాపారాన్ని మొదలుపెట్టిన అదానీ గురించి 2014 వరకు కొద్దిమంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు తప్ప ప్రపంచానికి తెలి యదు. ఆయనకు లిస్టెడ్ కంపెనీలున్నా, మార్కెట్లో వాటి ట్రేడింగ్ అంతంతమాత్రమే. ఎందుకంటే వాటి పట్ల దేశీ మ్యూచువల్ ఫండ్స్ గానీ, విదేశీ ఇన్వెస్టర్లు గానీ పెట్టుబడులకు ఆసక్తి చూపించింది లేదు. రిటైల్ ఇన్వెస్టర్లకు అదానీ షేర్లలో పెద్దగా పాలుపంచుకునేవారు కాదు.
అదే ఏడాది ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోదీ తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఒక్కసారిగా మార్కెట్లో అదానీ షేర్లు పెద్ద ర్యాలీ చేయడంతో ఈ గ్రూప్ మీద ఫోకస్ పడింది. అప్పుడు ఆ షేర్ల ధరల ప్రకారం ఆ కంపెనీల్లో అదానీకి ఉన్న వాటాకు ఆయన సంపద రూ.17,000 కోట్లు. ఇప్పుడది రూ.10.30 లక్షల కోట్లు. అప్పుడు ఫోర్బ్స్ ప్రపంచ ఐశ్వర్యవంతుల జాబితాలో అదానీ స్థానం 609. ఇప్పుడు 3. హురున్ గ్లోబల్ రిచ్లిస్ట్ ప్రకారం 2021లో అదానీ సంపద వారానికి సగటున రూ.6,000 కోట్ల చొప్పున పెరిగింది. గత ఏడాదిలోనే రెట్టింపైంది. ఈ మధ్యలోనే అదానీ గ్రూప్ రేవులు, విమానాశ్రయాలు, సిమెంట్ కంపెనీలతో పాటు పలు టేకోవర్లు జరిపింది.
మిత్రులకు మోదీ సాయం
దేశంలో ప్రతీ గంటకూ 5గురు రోజువారీ వేతన కార్మికులు మరణిస్తున్నారు. ప్రధాన మంత్రికి ఫేవరేట్ మిత్రుడి సంపద ప్రతీ గంటకూ రూ.85 కోట్ల చొప్పున పెరిగింది. ప్రధానికి ఒకటే పని.. ‘సామాన్యుడ్ని దోచి తన మిత్రుల్ని ధనికుల్ని చేయడం’. తన స్నేహితుల్ని శ్రీమంతుల్ని చేయడంలో నరేంద్ర మోదీ సాయపడుతున్నారు.
-బ్లూంబర్గ్ రిపోర్ట్పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్