న్యూఢిల్లీ: భారత 74వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో నిర్వహించిన ప్రధాన వేడుక దేశ సైనిక పాటవాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను, మహిళా సాధికారతను, శక్తిని ప్రపంచానికి చాటాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్తవ్యపథ్లో నిర్వహించిన కవాతులో ఈజిప్ట్ సైనిక దళాలకు చెందిన బృందం కూడా పాల్గొన్నది.
ఈసారి గణతంత్ర వేడుకలను ‘నారీశక్తి’ థీమ్తో నిర్వహించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర సైనికులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించటంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆత్మనిర్భర్ భారత్ను ఆవిష్కరిస్తూ దేశీయంగా తయారైన 105 ఎంఎం తుపాకులతో సైనికులు వందనం సమర్పించారు. ఈ వేడుకల్లో తొలిసారి అగ్నివీర్ సైనికుల బృందం పాల్గొన్నది. మార్చింగ్ జరుగుతుండగా 45 యుద్ధ విమానాలు భీమ్, వజ్రాంగ్, బాజ్, తిరంగా, గరుడ, అమృత్, త్రిశూల్ కాన్సెప్టులతో కర్తవ్యపథ్పై విన్యాసాలు నిర్వహించాయి. విన్యాసాల్లో మిగ్-29, ఎస్యూ-30ఎంకేఐ, రఫేల్తోపాటు సీ-130 సూపర్ హెర్కులస్, సీ-17 గ్లోబ్మాస్టర్ వంటి భారీ విమానాలు కూడా పాల్గొన్నాయి. ఈ వేడుకల్లో మొదటిసారి నేవీకి చెందిన ఐఎల్-38 సముద్రగస్తీ విమానం పాల్గొనటం విశేషం. మార్చింగ్లో అర్జున్ యుద్ధ ట్యాంకులతోపాటు నాగ్ మిసైల్ సిస్టమ్, కే-9 వజ్ర వంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను భారత్ ప్రదర్శించింది. నారీశక్తిని గుర్తుచేస్తూ నాగ్ మిసైల్ స్టిస్టమ్కు ప్రదర్శనలో లెఫ్టినెంట్ చేతనాశర్మ నాయకత్వం వహించారు. ఇండియన్ నేవీ కంటింజెంట్కు లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ నాయకత్వం వహించారు.