హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన పట్టణ స్థానిక సంస్థల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో అర్హులైనవారికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో కరోనా సోకి పలువురు మున్సిపల్ ఉద్యోగులు మరణించారు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకాలపై గతంలో ఉన్న ఉత్తర్వులను అమలు చేయాలని మంత్రి స్పష్టం చేయటంతో సీడీఎంఏ సత్యనారాయణ.. మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేస్తూ కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు వెంటనే సమర్పించాలని తెలిపారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు నలుగురు చనిపోయినట్టుగా గుర్తించారు. వారిలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించారు.