US-Canada Border | మనుషుల అక్రమ రవాణా నలుగురి ప్రాణం తీసేసింది.అందులో ఓ పసి కందు కూడా ఉండడం హృదయ విదారక అంశం. అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులతో సహా ఓ పసికందు చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసు బృందం తెలిపింది. ఈ నలుగురూ తీవ్రమైన చలిని తట్టుకోలేకే ప్రాణాలు కోల్పయారని పేర్కొన్నారు. అక్రమ రవాణా మూలంగానే ఇదంతా జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే వీరు బార్డర్ క్రాసింగ్ చేయడానికి ప్రయత్నించారని, కానీ సఫలం కాలేదని రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీసు బృందం వారు అంటున్నారు. మంచు తుపానులు, చీకటి, పొలాలు, చలి కారణంగా వారికి దిక్కు తోచలేదని చివరికి ప్రాణాలు కోల్పోయారని ఆర్సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ జేన్మాక్లాచీ ప్రకటించారు. నేను చెప్పేది వినడానికి చాలా ఇబ్బందికరంగా వుంటుంది. ఎంతో హృదయ విదారక అంశం. తీవ్రమైన చలిని తట్టుకోలేకే నలుగురు భారతీయులు అమెరికా- కెనడా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయారు. అని జేన్మాక్లాచీ తెలిపారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. కెనడా-అమెరికా సరిహద్దుల్లో పసి పాపతో సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారన్న నివేదిక చూసి షాక్కు గురయ్యాను. ఈ పరిస్థితిపై అత్యవసరంగా స్పందించాలని అమెరికా, కెనడాలో వుండే రాయబారులను ఆదేశించాం అని జైశంకర్ ట్వీట్ చేశారు.