న్యూఢిల్లీ: ‘బీఏటీ-బీఎంఎస్’ అనే చైనీస్ స్మార్ట్ఫోన్ యాప్ను ఉపయోగించి రోడ్లపై వెళ్తున్న బ్యాటరీ రిక్షాలను కొందరు వ్యక్తులు రిమోట్గా నిలిపివేస్తున్నట్టు చూపే వీడియోలతో సోషల్ మీడియా నిండిపోతున్నది. చైనాకు చెందిన షెన్జెన్ గ్రీనెర్జీ టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్ బ్లూటూత్ సదుపాయం ఉన్న లిథియం బ్యాటరీలను ట్రాక్ చేయడానికి, నియంత్రించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) రంగానికి సంబంధించి సైబర్ భద్రతపై ఆందోళనలను రేకేత్తిస్తున్నది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రెడ్డిట్, ఎక్స్లలో కంటెంట్ క్రియేటర్లు ఈ-రిక్షాలు, ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫ్ చేస్తూ, ఆ వాహనాలు రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆగిపోయేలా చేస్తున్న దృశ్యాలను రికార్డు చేస్తున్నారు. రిమోట్గా పనిచేసే ఇలాంటి యాప్లను ఉపయోగించడం వల్ల ఈ-రిక్షా(టెర్రి) యజమానులు అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారని పలువురు నెటిజన్లు విమర్శించారు.
షెన్జెన్ గ్రీనెర్జీ టెక్నాలజీ అనేది చైనాకు చెందిన ఒక బ్యాటరీ తయారీ సంస్థ. ఇది 2010 నుంచి పని చేస్తున్నది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఇది భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మార్కెట్లకు బ్యాటరీలను సరఫరా చేస్తున్నది. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన బీఏటీ-బీఎంఎస్ అనేది బ్యాటరీ నిర్వహణ కోసం రూపొందించిన ఒక చట్టబద్ధమైన సాధనం తప్ప హ్యాకింగ్ యాప్ కాదు. ఇది 10-15 మీటర్ల పరిధిలో బ్లూటూత్ సదుపాయం కలిగిన లిథియం బ్యాటరీలకు వైర్లెస్గా కనెక్ట్ అవ్వడానికి వినియోగదారులకు అనుమతి ఇస్తుంది. ఇది వినియోగదారులకు బ్యాటరీలను రిమోట్గా నియంత్రించే ఫీచర్ను కూడా ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్నే వినోదం, వ్యూస్ కోసం ఈ-రిక్షా బ్యాటరీలను ఆఫ్ చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారు.
భారత్లో అనేక బడ్జెట్ ఈ-రిక్షాలు, ఎలక్ట్రిక్ స్కూటర్లు చైనాలో తయారైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్(బీఎంఎస్) ఉపయోగిస్తున్నాయి. వీటిలో భద్రత చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. తరచూ బ్లూటూత్ సెట్టింగులు డీఫాల్ట్గా ఓపెన్లోనే ఉంటాయి. ఒకవేళ వారు పవర్ అవుట్పుట్ కట్ చేస్తే వాహనం హఠాత్తుగా ఆగిపోతుంది. ఈ యాప్ దుర్వినియోగం గురించి ఆన్లైన్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ సంఘటనలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. అయితే చైనీస్ మొబైల్ అప్లికేషన్ వల్ల కలిగే భద్రతాపరమైన ప్రమాదాలను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నదని ఒక అధికారి తెలిపారు.
ఎవరైనా బీఎంఎస్ యాప్ను ఉపయోగించి ఈ-రిక్షా బ్యాటరీని బ్లాక్ చేయడం వల్ల పవర్ ఫెయిల్ అయినట్టయితే భయపడాల్సిన అవసరం లేదు. వాహనం ఆగిపోతే ముందుగా దానిని సురక్షితంగా పార్క్ చేయాలి. బ్యాటరీ మెయిన్ స్విచ్ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. తర్వాత వాహనం కీని ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాలి. తర్వాత మీ ఫోన్లో బీఏటీ-బీఎంఎస్ యాప్ను ఓపెన్ చేసి డివైజ్ లిస్ట్లో బ్యాటరీ కనిపిస్తే దానికి కనెక్ట్ అవ్వాలి. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకవేళ సేఫ్ మోడ్లోకి ప్రవేశించి ఉంటే, ఈ-రిక్షా మళ్లీ నడవడానికి ఈ రీసెట్ ప్రక్రియ తరచుగా సరిపోతుంది. సమస్య అలాగే కొనసాగితే అధీకృత సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.