Youth Congress : ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన చేశారు. ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా నిరసనలో భాగంగా కాంగ్రెస్ యువ నాయకులు ఈ పని చేశారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది.
సదస్సులోని ఒక వేదిక వద్దకు చేరుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. ఇండియా-యూఎస్ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా అందరూ తమ షర్ట్స్ విప్పి నిరసన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నిర్భయంతో తమ కార్యకర్తలు నిరసన తెలిపారని, ట్రేడ్ డీల్ ద్వారా ప్రధాని మోదీ దేశం విషయంలో కాంప్రమైజ్ అయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతర్జాతీయ సదస్సులో ఇలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
దేశానికి కీలకంగా మారిన ఈ సదస్సులో ఇలా ఆందోళన చేయడమేంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వేదిక వద్ద ఆందోళన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఐ సదస్సు సక్సెస్ కావడంతో, దీన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు అసూయతో ఇలా ఆందోళన చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. వీళ్లు ఐఎన్సీ కాదని.. ఏఎన్సీ (యాంటీ నేషనల్ కాంగ్రెస్) అని బీజేపీ వర్ణించింది.