న్యూఢిల్లీ, జూలై 6: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థినిపై ఆమె మాజీ ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. తనతో ప్రేమబంధాన్ని తెంచుకుందన్న కోపంతో ఆమెను కిడ్నాప్ చేసి వైర్లతో బంధించి, సజీవంగా పూడ్చిపెట్టి హతమార్చాడు. ఈ సంఘటన మార్చి 2021లో జరుగగా, కేసు విచారణ సందర్భంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. వివరాల్లోకి వెళితే.. భారత్కు చెందిన 21 ఏండ్ల జాస్మిన్ కౌర్ నర్సింగ్ చదవడానికి ఆస్ట్రేలియాలోని అడిలైడ్కు వెళ్లింది. అక్కడ తారిక్జోత్ సింగ్ పరిచయమయ్యాడు. అయితే అతడి వైఖరి సరిగ్గా లేకపోవడంతో దూరం పెట్టింది.
దీంతో కక్ష పెంచుకుని ఎలాగైనా పగతీర్చుకోవాలనుకున్న సింగ్ మార్చి 5, 2021న ఆమెను ఉద్యోగం చేస్తున్న చోటునుంచి కిడ్నాప్ చేశాడు. తర్వాత వైర్లతో బంధించి స్నేహితుడి దగ్గర నుంచి తెచ్చిన కారు డిక్కీలో ఉంచి 650 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ రేంజ్లో ఒక మారుమూల ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమె గొంతుపై గాయం చేశాడు. వైర్లతో కట్టి ఉన్న ఆమెను బతికుండగానే పూడ్చి పెట్టి ఏమీ తెలియనట్టు తన ఊరు వచ్చేశాడు. కౌర్ అదృశ్యమైనట్టు నెల రోజుల తర్వాత పోలీసులు అనుమానంతో తారిక్ను ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.