మెల్బోర్న్ : ఖలిస్తానీ కార్యకలాపాలను వ్యతిరేకించిన 23 ఏండ్ల భారత విద్యార్ధిపై ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సిడ్నీలోని మేరీల్యాండ్స్ పశ్చిమ సబర్బ్లో ఈ ఘటన జరిగింది. యువకుడిపై దాడి చేసిన వ్యక్తులు ఖలిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. యువకుడు విధి నిర్వహణ నిమిత్తం వెళుతుండగా ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు.
డ్రైవర్గా పనిచేస్తున్న బాధిత విద్యార్ధి జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ తాను పనిచేసేందుకు వెళుతుండగా నలుగురైదుగురు ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఖలిస్తాన్ను వ్యతిరేకిస్తే మున్ముందు ఇదే గతి పడుతుందని వారు హెచ్చరించారని తెలిపారు.
దుండగులు తమ వాహనం ఎడమవైపు డోర్ను ఓపెన్ చేసి నడుచుకుంటూ వెళుతున్న తనను ఐరన్ రాడ్తో కొట్టారని, దాడి చేసిన అనంతరం వారు పరారయ్యారని వివరించారు. ఈ ఘటనపై న్యూ సౌత్వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు. గాయపడిన విద్యార్ధిని పోలీసులు వెస్ట్మెడ్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల, కాలు, భుజాలపై గాయాలయ్యాయని చెప్పారు.
Read More :