న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించి.. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రెజ్లర్ల పోరాటాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేసింది. బీజేపీ నాయకురాలు, మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నదని సాక్షి వెల్లడించింది. దేశ రాజధాని జంతర్ మంతర్లో జరిగిన నిరసనలకు యావత్ దేశం తమ వెంట నిలిస్తే.. బబితా వంటి కొందరు బీజేపీ నాయకులు మాత్రం తోటి రెజ్లర్లకు కనీస మర్యాద ఇవ్వడం లేదని వాపోయింది.
ఈ మేరకు తన భర్త సత్యవత్ కాదియాన్తో కలిసి సాక్షి ఓ వీడియో విడుదల చేసింది. ‘దేశానికి పతకాలు అందించిన మల్లయోధులతో వ్యవహరించే తీరు ఇదేనా? భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తప్పు చేశాడు కాబట్టే అతడిపై చర్యలు తీసుకోవాలని మేము పట్టుబట్టాం. అంతే తప్ప ఇదేదో మా స్వలాభం కోసం చేస్తున్న పోరాటం కాదు’ అని పేర్కొంది.