న్యూఢిల్లీ: ఆహారం తాజాదనాన్ని, పాడైన ఆహారాన్ని గుర్తించేందుకు అతి చిన్న, చౌకైన ఎసిడిటీ సెన్సర్ను తయారుచేశారో భారతీయ శాస్త్రవేత్త. అమెరికాలో టెక్సాస్లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న నాగాలాండ్కు చెందిన కెంగ్డౌలియు చవాంగ్ దీన్ని అభివృద్ధి చేశారు. ఈ సెన్సర్ రెండు మిల్లీమీటర్ల పొడవు, 10 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్యాకేజ్లో దీన్ని పెట్టడం ద్వారా ఆహార తాజాదనాన్ని గుర్తించవచ్చని, పాడైతే వెంటనే తెలుసుకోవచ్చని చవాంగ్ తెలిపారు. ఏటా ప్రపంచంలో 1.3 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారం వృథా అవుతున్నదని, దీనిని నివారించేందుకు ఈ సెన్సర్ ఉపయోగపడుతుందన్నారు.