Indian Railway | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే టికెట్ల అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ వ్యవధిని తగ్గింది. ఇప్పటి వరకు ముందస్తు రిజర్వేషన్కు 120 రోజుల గడువు ఉన్నది. దీన్ని 60 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన నవంబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. అంతకు ముందు చేసుకున్న టికెట్ల బుకింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదని రైల్వేశాఖ ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు చేసిన అన్ని బుకింగ్స్ అలాగే ఉంటాయని చెప్పింది. విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండబోదని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. రైల్వేశాఖ ప్రకటన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఐఆర్సీటీసీ పతనమయ్యాయి. 2.2శాతం తగ్గి రూ.867.60 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్ తదితర ఎక్స్ప్రెస్ రైళ్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని.. ముందస్తు రిజర్వేషన్ ఇప్పటికే తక్కువ కాల పరిమితి ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. నిత్యం లక్షల మంది రైల్వేలో ప్రయాణిస్తుంటారు. ఏటా 30 నుంచి 35కోట్ల మంది రైల్వేలో ప్రయాణిస్తుంటారని అంచనా. టికెట్ ధర తక్కువ, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా ముందస్తుగా టికెట్లను రిజర్వేషన్ చేసుకుంటారు. ప్రస్తుతం 120 రోజుల వరకు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం దీన్ని 60 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.