న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టికెట్ల బుకింగ్ పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆధార్ లింక్ చేయని ఐఆర్సీటీసీ యూజర్లు ఒక్కో ఐడీ నుంచి నెలకు గరిష్ఠంగా 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆధార్ లింక్ చేసిన యూజర్లు 24 టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ కేటగిరీకి సంబంధించి షరతు విధించింది.
యూజర్ ఐడీని ఆధార్తో లింక్ చేసి, టికెట్ బుక్ చేసుకును ప్రయాణికుల్లో ఒకరి ఆధార్ను వెరిఫై చేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం నెలకు ఆధార్ అనుసంధానం చేయని యూజర్ ఐడీ ద్వారా నెలలో ఆరు టికెట్లను మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం ఉన్నది. అయితే, దీన్ని 12కు పెంచింది. ఇదే సమయంలో ఆధార్ అనుసంధానం చేసిన యూజర్ ఐడీతో ప్రస్తుతం నెలకు 12 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా.. దీన్ని రెట్టింపు చేసింది. ఇకపై నెలలో యూజర్లు 24 టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.