ముంబై, డిసెంబర్ 26: స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’ మంగళవారం నేవీ అమ్ములపొదిలోకి చేరింది. దీని పొడవు 163 మీటర్లు. బరువు 7,400 టన్నులు. వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు.
ఈ నౌకలో క్షిపణి విధ్వంసకర వ్యవస్థ, టోర్పిడో ట్యూబ్స్, యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్స్, సూపర్ రాపిడ్ గన్మౌంట్, కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలా పలు రకాల అధునాతన అస్ర్తాలు ఉన్నాయి. ఇందులో బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఉంటాయి. జీవ, అణు, రసాయన పరమైన దాడులను సైతం ఎదుర్కొనే సామర్థ్యం ఈ యుద్ధనౌకకు ఉన్నది.
వాణిజ్య నౌకపై దాడి నేపథ్యంలో అరేబియా సముద్రంలో యుద్ధనౌకలను నావికాదళం మోహరించింది. నిఘా కోసం పీ-8ఐ నౌక, ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతాలను మోహరించింది. మరోవైపు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అరేబియాలో వాణిజ్య నౌకపై దాడి చేసినవాళ్లు సముద్ర గర్భంలో దాకొన్నా పట్టుకుంటామని హెచ్చరించారు. ‘అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. వాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటాం. సముద్ర గర్భంలో దాచుకున్నా సరే పట్టుకుంటాం’ అని తెలిపారు.