బ్రేకింగ్.. బిగ్ బ్రేకింగ్.. తాజా వార్త.. సంచలన వార్త.. జర్నలిజానికి పట్టిన జబ్బులివి! ఈ వ్యామోహంలో ఏది పడితే అది రాసి ప్రచారం చేయటంతో ప్రజల్లో జర్నలిజానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింటున్నది. అందుకు సోషల్ మీడియా కూడా దోహదం చేస్తున్నది. ఆధార రుజువు లేని ఆ పోస్టులకు వంత పాడుతూ అదే దారిలో పయనిస్తూ వార్తాపత్రికలు, చానళ్లు దెబ్బతింటున్నాయి. ‘మేమే ముందు బ్రేకింగ్ ఇచ్చాం’ అన్న మోజు.. తప్పులకు రివాజు అవుతున్నది.
Journalism | ‘గర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మృతి.. కాదు కాదు అంతా తూచ్’.. ఈ ఒక్క వార్త దేశ జర్నలిస్టులు, ప్రజా సంబంధాల (పీఆర్) బృందాలను ఉలిక్కిపడేలా చేసింది. నిక్కచ్చిగా చెప్పాలంటే.. మూసుకుపోయిన జర్నలిజం కండ్లను తెరిపించింది. యస్! సోషల్ మీడియా ఉచ్చులో పడి కొట్టుమిట్టాడుతున్న వార్తాపత్రికలు, న్యూస్ చానెళ్లను అలర్ట్ చేసింది. ‘ఏది నిజం?, వాస్తవ పరిస్థితులు, ప్రజాహిత సమాచారం’ లాంటివి లేకుండానే జర్నలిజం కొనసాగుతున్న రోజులివి. ఒక వదంతి, అబద్ధం కాదు.. ఒక వాదన, నిజం కాదు.. ఒక ఆరోపణ, తీర్పు కాదు.. అన్న విషయాలు మరిచిపోతున్నందునే ‘పూనమ్ పాండే’ లాంటి ఘటనలు జర్నలిజానికి సవాలు విసురుతున్నాయి. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తున్నదన్న నానుడిని గుర్తుచేస్తూ ఒక తప్పుడు సమాచారం ఒక వార్తగా మారి అదే నిజమనేలా చేస్తున్నది.
పూనమ్కు ఇదే మొదటిది కాదు
వార్తల్లో నిలవాలి.. తానే వార్త కావాలి.. అందరూ తననే చూడాలి.. అన్న తాపత్రయం పూనమ్పాండేది. అందులో భాగమే ఆమె చేష్టలు. ఆ చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కోసం తననే చంపేసుకున్నంతగా! తన పీఆర్ బృందమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అంతా నమ్మారు. అంతకుముందు 2011 క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంలోనూ ‘న్యూడ్’ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది.
భారత్ వరల్డ్కప్ గెలిస్తే న్యూడ్ షో చేస్తానని ట్రిక్ ప్లే చేసి మీడియాను తనవైపు తిప్పుకుంది. భారత్ కప్ గెలవగానే సైలెంట్ అయిపోయింది. ఇక్కడ ఆమె ఏం చేసింది? అన్నది ముఖ్యం కాదు. ఆమె చర్యలకు మీడియా ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నది అన్నదే ప్రధానం. ఆమె గిమ్మిక్కులకు నెటిజన్లు తిట్టిపోశారు. కానీ, జర్నలిస్టులు చనిపోయిందని ఆధారాలు సేకరించారా? పీఆర్ టీం ప్రకటించగానే దాన్ని నిజం అని ఎలా పరిగణించారు? అన్నవి ప్రశ్నలు. ఆ ప్రకటనపై ఫ్యాక్ట్ చెక్ లేకపోవటమే ప్రజల్లో మీడియాను చులకన చేస్తున్నది.
డిజిటల్ మార్కెటింగ్ కమ్మేస్తున్నా..
ప్రస్తుతం అంతా సోషల్ మీడియాదే హవా. డిజిటల్ మార్కెటింగ్తో పోటీ పడాలన్న తాపత్రయమే వార్తాచానళ్లు, పత్రికలకు ప్రమాదకరంగా మారింది. ఒక వార్త చానళ్లలో, పేపర్లలో వచ్చే సరికే డిజిటల్ మీడియా ప్రపంచవ్యాప్తం చేస్తున్నది. కానీ, ఇక్కడ సోషల్ మీడియా ప్రచారం చేసే ప్రతి వార్త నిజం కాదు.
టీఆర్పీ, సర్క్యులేషన్ కోసం..
ఫేక్ వార్తలను వండి వార్చి బ్రేకింగ్లా ఇచ్చి.. టీఆర్పీ, సర్క్యులేషన్ పెంచుకొనే మోజులో జర్నలిజం పక్కదారి పడుతున్నది. నిజానిజాలు తెలుసుకోకుండా, ప్రముఖులకు సంబంధించిన ఏదేని అంశం దొరికిందే తడవుగా మీడియా సంస్థలు గాలి వార్తలను సైతం పబ్లిష్ చేస్తున్నాయి. ఇక, సోషల్ మీడియాలో వచ్చిన వాటిని పబ్లిష్ చేస్తూ విశ్వసనీయతను కోల్పోతున్నాయి. విశ్వసనీయ పత్రికల్లో వచ్చినా ప్రజలు నమ్మలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. దానికి తాజా ఉదాహరణే పూనం పాండే ఘటన. గర్భాశయ క్యాన్సర్ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించటం.. ఆ మరుసటిరోజే పూనమ్ పాండే అదే వ్యాధితో మరణించిందని వార్త రావటంతో వార్తాచానళ్లు, వార్తాపత్రికలు బ్రేకింగ్, హైలైట్ చేశాయి.
ఇదే వేకప్ కాల్
ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా లాంటి దేశాలకు ఫేక్ న్యూస్ గుదిబండలా మారుతున్నది. కొన్ని బిజినెస్ సంస్థలు, రాజకీయ పార్టీలు తప్పుడు సమాచారాన్ని వదులుతున్నాయి. ఇక్కడ పూనమ్ పాండే ఘటనకు ప్రాధాన్యం చిన్నదే కావొచ్చు. కానీ, భారీ విపత్తుకు దారి తీసే తప్పుడు సమాచారం ప్రజల్లోకి చొచ్చుకుపోతే? అందుకే జర్నలిస్టు బాధ్యత జాతిని జాగృతం చేసేలా ఉండాలి. జర్నలిస్టు విధి ఫ్యాక్ట్ చెక్తో ముడిపడి ఉండాలి.
– సెంట్రల్ డెస్క్