న్యూఢిల్లీ : ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతున్నది. ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తరలింపును వేగవంతం చేసిన కేంద్రం.. ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నది. తాజాగా ఖార్కివ్లో ఉన్న భారతీయులకు మరోసారి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ఖార్కివ్ నగరాన్ని తక్షణం వీడాలని సూచించింది.
నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా వెళ్లాలని, స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు ఆయా ప్రాంతాలకు చేరుకోవాలంటూ సూచనలు చేసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అక్కడ ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారత దేశ జెండా పట్టుకొని ఖార్కివ్లో గుంపులు గుంపులుగా నడుస్తూ రైల్వేస్టేషన్లకు వెళ్తున్నారు.
వాహనాలు అందుబాటులో లేకపోవడంతో భారత్ నుంచి విద్యార్థులు, కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారంతా భారత జాతీయ జెండాను పట్టుకొని సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్లకు వెళ్తున్నట్లు ఓ విద్యార్థి తండ్రి తెలిపాడు. ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఇవాళ మరోసారి చర్చలు జరుగనున్నాయి. చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించిందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ పేర్కొంది. సమావేశం జరిగే స్థలం గురించి సమాచారం ఇవ్వలేదు.