వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారత దేశ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. కరోనా కాలంలో 7.3 శాతం వరకూ తగ్గిపోయిన భారత ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 9.5 శాతంగా ఉందని అంచనా వేసింది. ఇది వచ్చే ఏడాది 8.5గా ఉంటుందని అభిప్రాయపడింది. భారత వృద్ధి రేటు విషయంలో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ (డబ్ల్యూఈవో) జులై నెలలో వేసిన అంచనాల్లో కూడా పెద్దగా మార్పులు లేవు.
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల వార్షిక సమావేశం నేపథ్యంలో డబ్ల్యూఈవో తాజా అప్డేట్ విడుదలైంది. దీని ప్రకారం, 2021లో ప్రపంచ వృద్ధిరేటు 5.2 శాతంగా ఉండగా, వచ్చే ఏడాది ఇది 4.9 శాతంగా ఉండబోతోందని డబ్ల్యూఈవో అంచనా వేసింది. అమెరికా ఈ ఏడాది 6 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుందని, అయితే వచ్చే ఏడాది ఇది 5.2 శాతంగా ఉంటుందని అభిప్రాయపడింది. అదే సమయంలో ఈ ఏడాది చైనా వృద్ధి రేటు 8 శాతం ఉండగా, వచ్చే ఏడాది ఇది 5.6 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేసింది.