న్యూఢిల్లీ: భారతీయ ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్లో ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్సభలో 2023 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. భారత ఆర్ధిక వ్యవస్థ దివ్యమైన భవిష్యత్తు దిశగా వెళ్తోందన్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని ఆమె తెలిపారు. కోవిడ్ సమయంలో ఎవరూ ఆకలితో చావకూడదన్న ఉద్దేశంతో.. సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. 28 నెలలుగా ఆ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
గడిచిన 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెండింతలు అయ్యిందని, అది 1.97 లక్షలకు చేరుకున్నట్లు ఆమె చెప్పారు. భారతీయ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచలోనే అయిదవ అతిపెద్ద వ్యవస్థగా మారిందన్నారు. భారత్ ధగధగ వెలుగుతున్న నక్షత్రమని ప్రపంచం గుర్తించిందని, ఈ ఏడాదికి మన వృద్ధి 7.0 శాతంగా ఉందని, అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో మనదే అత్యధిక స్థాయిలో ఉందన్నారు.
టూరిజంకు భారీ స్థాయిలో ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత ఆర్ధిక వ్యవస్థ చాలా పరిణితి సాధించిందన్నారు.