న్యూఢిల్లీ: కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్(S Jaishankar) తెలిపారు. పదేపదే దౌత్యవేత్తలను బెదిరించడం వల్లే కెనడాలో వీసాల జారీ నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ అంశంలో కెనడా ప్రభుత్వం నుంచి కూడా తమకు ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో.. కెనడా పౌరులకు వీసాలు జారీ చేయడాన్ని ఇండియా తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో వీసాల జారీని ఆపేశారు. ఆ తర్వాత కొన్ని వారాలకు మళ్లీ వీసా జారీ ప్రారంభించారు. లండన్తో పాటు శాన్ఫ్రాన్సిస్కో కౌన్సులేట్లో జరిగిన దాడులకు సంబంధించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జైశంకర్ కోరారు. ఒ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ జైశంకర్ ఆ వ్యాఖ్యలు చేశారు.