అహ్మదాబాద్ : భారత్లోకి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పాక్ కుట్రలు పన్నుతున్నది. పక్కాగా అందించిన సమాచారం మేరకు అరేబియా సముద్రం మార్గంలో తరలించేందుకు యత్నిస్తుండగా.. ఇండియన్ కోస్ట్గార్డ్ కుట్రను భగ్నం చేసింది. ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి పాక్ బోటులో నుంచి భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని జకావూకు తరలించారు. బోట్లో 55 హెరాయిన్ ప్యాకెట్లలో 56 కిలోల వరకు హెరాయిన్ను స్వాధీనం చేసుకోగా.. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.280కోట్ల వరకు ఉంటుందని అంచనా.
అయితే, ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్ ఏటీఎస్ను చూసిన స్మగ్లర్లు తప్పించుకొని పాక్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపి పారిపోకుండా అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా.. నిన్న అట్టారీ సరిహద్దులో ఆదివారం కస్టమ్స్ డిపార్ట్మెంట్ రూ.700కోట్ల విలువైన 102 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించగా.. అమృత్సర్ కస్టమ్స్ (పీ) కమిషనరేట్ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ (ఐసీపీ)లో 102కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.