Gautam Adani : ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautham Adani) కి అమెరికా కోర్టు (USA) లో కీలక ఊరట లభించింది. తమపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన ఫ్రాడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు న్యూయార్క్ (NewYork) లోని ఫెడరల్ కోర్టు (Federal Court) అంగీకరించింది. ఈ కేసు అమెరికా చట్టాల పరిధిలోకి రాదని, ఇది పూర్తిగా దేశం వెలుపల జరిగిన వ్యవహారమని అదానీ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
భారత్లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారని, ఈ విషయాన్ని అమెరికా పెట్టుబడిదారుల నుంచి దాచిపెట్టి నిధులు సేకరించారని ఆరోపిస్తూ 2024 నవంబర్లో ఎస్ఈసీ ఈ కేసును దాఖలు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతోపాటు ఆయన బంధువు సాగర్ అదానీని కూడా ప్రతివాదిగా చేర్చింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించింది.
ఈ కేసు పూర్తిగా భారత్కు సంబంధించినదని దీనిపై విచారణ జరిపే అధికారం అమెరికా కోర్టులకు లేదని స్పష్టంచేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 2021లో జారీ చేసిన బాండ్ల అమ్మకం అమెరికా వెలుపల జరిగిందని, ఈ బాండ్ల కాలపరిమితి కూడా ముగిసిందని తెలిపింది. 2024లో అసలు, వడ్డీతో సహా పెట్టుబడిదారులకు పూర్తి సొమ్మును తిరిగి చెల్లించామని, కాబట్టి ఎవరికీ ఆర్థిక నష్టం జరగలేదని కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలో కేసును ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని అదానీ తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు.
ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పిటిషన్పై విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపింది. ఇది అదానీకి తొలి విజయం కాగా.. సుదీర్ఘమైన విచారణ ప్రక్రియను తప్పించుకునేందుకు ఆయనకు ఒక అవకాశం లభించినట్లయ్యింది.