న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దుల్లో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని.. భద్రతను పెంచేందుకు భారత సైన్యం కీలకమైన ముందడుగు వేసింది. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ‘స్వాతి’ వెపన్ లొకేటింగ్ రాడార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖకు సైనం ప్రతిపాదనలు పంపింది.
స్వాతి (weapon-finding radars) కోసం సైన్యం రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఉన్నతస్థాయి రక్షణ మంత్రిత్వ శాఖ సమావేశంలో పరిశీలనలో ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘స్వాతి’ పేరిట పిలిచే వెపన్ లొకేటింగ్ రాడార్లు మోర్టార్లు, షెల్స్, రాకెట్లు వంటి శత్రు ఆయుధాలు 50 కిలోమీటర్ల దూరం వరకు కాల్చబడుతున్న ప్రదేశాన్ని గుర్తించడంలో బలగాలకు సహకరించనున్నది. ఈ వ్యవస్థ ఆర్టిలరీ గన్ వంటి శత్రు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా సైన్యం ఎదురుదాడి చేసేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.
స్వాతి రాడార్లను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. ఇప్పటికే ఇవి విజయవంతం కాగా.. ఆర్మేనియాకు సరఫరా చేశారు. ప్రస్తుతం భారత ఆర్మీ వెపన్ లోకేటింగ్ రాడార్లను జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి కార్యాకలాపాలకు వినియోగిస్తున్నది.