న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్లోని కిష్టవార్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తెలంగాణకు చెందిన టెక్నీషియన్ అనిల్ మృతిచెందగా, మరో ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ద్రువ్(ALH Dhruv)లను ఆర్మీ గ్రౌండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ హెలికాప్టర్ల ఉన్న లోపాల వల్లే వాటిని నిలిపివేసినట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది.
ఇటీవలే ద్రువ్ చాపర్లను నేవీతో పాటు కోస్టు గార్డులు కూడా నిలిపివేశారు. మార్చి నెలలో రెండు దుర్ఘటనలు జరిగిన నేపథ్యంలో ఆ హెలికాప్టర్లను గ్రౌండ్ చేశారు. అయితే పలు మార్లు చెకింగ్ నిర్వహించిన తర్వాత ఆర్మీ తన వద్ద ఉన్న ద్రువ్ హెలికాప్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ నేవీ, కోస్టు గార్డులు ద్రువ్ హెలికాప్టర్లకు మళ్లీ పచ్చజెండా ఊపాయో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఈ హెలికాప్టర్లకు ఆ సంస్థే క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గడిచిన రెండు నెలల్లో ఏఎల్హెచ్ ద్రువ్ హెలికాప్టర్లు కూలిపోవడం ఇది మూడవ ఘటన. ఈ మధ్యే ఇండియన్ నేవీకి చెందిన ద్రువ్ హెలికాప్టర్ను ఆరేబియా సముద్రంలో ల్యాండ్ చేశారు. ఇక కోస్టు గార్డుకు చెందిన ద్రువ్ను టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే కొచ్చిలో ల్యాండ్ చేశారు.
అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ద్రువ్ను ప్రత్యేకంగా సాయుధ బలగాల కోసం తయారు చేశారు. ఆర్మీ వద్ద ఉన్న ద్రువ్లు.. సియాచిన్ గ్లేసియర్తో పాటు లడాఖ్లోని హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో పనిచేయనున్నాయి. అయితే ఆ చాపర్లలో మెకానికల్ లోపాలు ఉన్నాయని, ఆ హెలికాప్టర్లు నమ్మకంగా లేవని ఆరోపణలు వస్తున్నాయి.