కోల్కతా: ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ‘ఛాయ్ పే చర్చా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కలకత్తాలో వలసవాదానికి ప్రతీకగా నిలిచిన విదేశీ విగ్రహాలన్నింటినీ తొలగిస్తాం. ఇండియా పేరును భారత్గా మార్చడం నచ్చని వాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చు’ అన్నారు.
ఇదే అంశంపై బీజేపీ మరో నాయకుడు రాహుల్ సిన్హా మాట్లాడుతూ.. ‘దేశానికి రెండు పేర్లు ఉండవు. ఢిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు జరుగుతోంది. పేరు మార్చడానికి ఇదే సరైన సమయం’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరుతో ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వాన పత్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటూ ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ట్యాగ్ చేశారు.
ఈ పోస్టు వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎప్పటి నుంచో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ‘ఇండియా’ పేరును కాదని భారత్గా పేర్కొనడం దారుణమని మండిపడ్డాయి. అయితే, ప్రతిపక్షాల విమర్శలను అధికార బీజేపీ తోసిపుచ్చింది. పురాణాల కాలం నుంచి కూడా దేశానికి భారత్ అనే పేరుందని, రాజ్యాంగంలోనూ భారత్ అనే పేరే ఉందని పేర్కొంది. ఈ వాదోపవాదాల నేపథ్యంలో తాజాగా దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.