న్యూఢిల్లీ: ముడి చమురును మరింత చౌకగా రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు అమ్మాలని రష్యాను కోరింది. ఒపెక్ దేశాల నుంచి రిస్క్ను ఎదుర్కొనేందుకు ఈ మేరకు ప్రతిపాదన చేసింది. కాగా, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో బ్యారెల్ ముడి చమురు ధర 130 డాలర్లుగా ఉన్నది. ప్రస్తుతం ఇది 108-105 డాలర్లకు దిగి వచ్చింది.
మరోవైపు భారత్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆయిల్ సంస్థలు రాయితీపై రష్యా ముడి చమురును ఇప్పటి వరకు 40 మిలియన్ బ్యారెల్స్కుపైగా కొనుగోలు చేశాయి. గత నెలలో కూడా రష్యా 15 మిలియన్ బ్యారెల్స్ చమురును ఒక్కసారికి భారీ తగ్గింపు ధరకు భారత్కు సరఫరా చేసింది. 2021లో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసిన దాని కంటే ఇది 20 శాతం అదనం.
కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్కు ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో మెరైన్ ఇన్సురెన్స్, రవాణా వంటి సమస్యలు రష్యాతో ఆయిల్ వ్యాపారాన్ని మరింత కఠినం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు చమురును అమ్మాలని రష్యాను భారత్ కోరుతోంది. దీనిపై రష్యా ఎలా స్పందిస్తుందో ఎదురు చూడాలి.