న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు, ఉద్రిక్తతల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకొంటామని చెబుతున్న చైనా.. ఇదే సమయంలో అక్సాయిచిన్ రీజియన్లో మిలటరీ స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలతో ఇండియా టుడే ఓ కథనం వెలువరించింది. 2021, డిసెంబర్ నాటి అక్సాయ్చిన్ రీజియన్ చిత్రాలను, ఈ ఏడాది ఆగస్టు 18న అదే రీజియన్లో పలు నిర్మాణాలతో కూడిన చిత్రాలను ప్రచురించింది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చేపట్టిన దీర్ఘశ్రేణి నిఘా రాడార్లతో కూడిన మిలటరీ సదుపాయాల విస్తరణ, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ, దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో రహదారులు, నిర్మాణంలో ఉన్న పలు నిర్మాణాలు మాక్సర్ శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఎల్ఏసీకి 65 కిలోమీటర్ల పరిధిలో ఉండటం గమనార్హం.