న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యంలో ఇవాళ (మంగళవారం) షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు (Summit ) జరుగనుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సదస్సు ఎన్నో విశేష ప్రాధాన్యతలకు వేదిక కానుంది. సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ తదితర షాంఘై ప్రతినిధి దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వారికి ప్రధాని మోడీ ఆతిథ్యమివ్వనున్నారు. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, కజక్స్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రాతినిధ్యంతో కూడిన ఈ షాంఘై సహకార సంస్థ.. గ్రూపులో కొత్త శాశ్వత సభ్యదేశంగా ఇరాన్కు స్వాగతం పలకనున్నది.
రష్యాలో గత వారం ఒక కిరాయి గుంపు వాగ్నర్ గ్రూప్ స్వల్పకాలిక సాయుధ తిరుగుబాటు చేసింది. దాంతో మాస్కోలో ఒక్కసారిగా అలజడికి గురైంది. ఆ తర్వాత తొలిసారి ఈ బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటుండడం విశేషం. అఫ్గానిస్థాన్లో పరిస్థితి, ఉక్రెయిన్ యుద్ధం, షాంఘై సభ్య దేశాలకు సహకార విస్తరణ ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి. దేశాల మధ్య అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడం కూడా ప్రధానంగా చర్చకు రానున్నట్టు ఆయా వర్గాలు వెల్లడించాయి.
భారత్, చైనా దేశాల మధ్య లడఖ్ సరిహద్దులో గత మూడేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు వ్యతిరేకంగా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 16న సమర్ఖండ్లో షాంఘై సదస్సు జరిగింది. రొటేషన్ పద్ధతితో సదస్సు నిర్వహణ బాధ్యత ఈసారి భారత్కు లభించింది.